నా భారత్‌ పర్యటన చారిత్రాత్మకం చేస్తా

  • నవంబర్‌లో భారత్‌ పర్యటనపై ఒబామా వ్యాఖ్య
  • ద్వైపాక్షిక భాగస్వామ్యం ఉభయ తారకమని ప్రకటన
వాషింగ్టన్‌: వచ్చే నవంబర్‌లో భారత్‌లో తాను జరిపే పర్యటన చరిత్రాత్మకం కాగలదనీ, భారత్‌ పర్యటనకు వెళ్ళడమంటే ఎంతో గర్విస్తున్నానని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక చర్చల ప్రారంభం సందర్భంగా ఆయన సందేశమిస్తూ, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌తో బంధం ఉభయతారకమే కాకుండా,ప్రపంచ దేశాలకు ఎంతో ఉపయుక్తం కాగలదని అన్నారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎంతో విలువ ఇస్తున్నామనీ,భవిష్యత్‌ తరాలకు కూడా ఇరుదేశాల మధ్య బంధం ఎంతో ఉపయుక్తం కావాలన్నదే తమ అభిమతమని ఆయన అన్నారు. వివిధ రంగాల్లో ఇరుదేశాలూ సాధించిన అభివృద్ధి ప్రస్తుత తరాల వారినే కాక, భవిష్యత్‌ తరాల వారికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. గత వారం తాను విడుదల చేసిన కొత్త జాతీయ భద్రతా వ్యూహం అమెరికా ప్రపంచ దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడానికి మూలస్తంభంగా ఉపయోగపడగలదని ఆయన అన్నారు.
అమెరికా, భారత్‌లు ఉమ్మడి లక్ష్యాలనూ, ఆశయాలనూ, ప్రయోజనాలనూ కలిగి ఉన్న దృష్ట్యా ఇరుదేశాల మధ్య బంధం ఏనాటికీ తెగిపోకపోవడమే కాక, క్రమంగా మరింత బలపడగలదని ఆయన అన్నారు. భారత్‌ పర్యటనను తాను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నానని అంటూ,చపాతీలు తినడం కోసం కాదని చలోక్తిగా అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ ఇప్పటికే భారత్‌లో పర్యటించి వచ్చిన సంగతిని గుర్తు చేశారు.”ఇది తలతో పని ఉన్న వ్యవహారం మాత్రమే కాదు, హృదయంతో సంబంధం ఉన్నది’ అని ఆయన అన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు శరవేగంగా విస్తృతమవుతున్నాయని ఆయన అన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యంపై గల అపోహలూ, అనుమానాలను తొలగిస్తానని కూడా ఆయన చెప్పారు.అంగీకారం కుదిరిన అంశాలపైనే కాక, విభేదించే విషయాలూ, అనుమానాలు తలెత్తే అంశాలపై కూడా ఇరుదేశాల మధ్య చర్చలు జరగవలసి ఉందని ఆయన అన్నారు.
ఉగ్రవాదంపై తక్షణ,నిర్దిష్ట చర్యలు అవసరం
ఉగ్రవాదంపై తక్షణ, నిర్దిష్ట చర్యలు అవసరమని భారత్‌,అమెరికాలు పిలుపు ఇచ్చాయి. మొదటి వ్యూహాత్మక చర్చల అనంతరం ఇరుదేశాలూ ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఉగ్రవాదంపై పోరునకు సంపూర్ణ సహాయ,సహకారాలను అందిస్తామని అమెరికా మరోసారి హామీపడింది. ముంబై దాడుల సూత్రధారులకు తగిన శిక్ష పడేట్టు చూడటంలో భారత్‌కి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.
ఉగ్రవాదంపై ఇరుదేశాలు తమ అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నాయనీ, భవిష్యత్‌లో అనుసరించవలసిన వ్యూహాల గురించిచర్చించాయని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ ఎం కృష్ణ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో తాను జరిపిన చర్చలు ఫలించాయనీ, భవిష్యత్‌లో ఇరుదేశాల మధ్య బంధం మరింత పెరగడానికి ఈ చర్చలు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. అణ్వస్త్రాల భద్రత, అణు ఇంధనం సరఫరా మొదలైన అంశాలపై అమెరికా తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Category: 0 comments

No comments:

Pages