కోట్లకు ... కోట్లే ...! అత్యధిక లీజు ధర రూ.3,69,99,999.99

(కెఎన్‌ఎన్‌ బ్యూరో / నల్గొండ): జిల్లాలో మద్యం షాపుల నిర్వహణకు కోట్లకు... కోట్లు వెదజల్లి దక్కించుకునేందుకు వ్యాపారులు ఆసక్తిని కనబర్చారు. జిల్లా పుటల్లో నూతన చరిత్రకు టెండర్‌ దారులు నాంది వాచకం పలికారు. అత్యధిక షాపులు గతంలో కన్నా రెట్టింపు ధరను పలికాయి. జిల్లాలోని మధ్యం ప్రియుల నాడిని పసిగట్టిన వ్యాపారులు కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి కోట్లకు కోట్లు సంపాదించేందుకు సిద్దపడిన తీరు పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జిల్లాలోని 241 మధ్యం షాపులకు దాఖలైన టెండర్లలో 98 షాపులకు సంబందించిన టెండర్లు ఖరారు కాగా వాటిపై లీజు రూపేనా ఇప్పటికే ప్రభుత్వానికి రూ.138,62కోట్ల ఆధాయం లభించిందంటే మధ్యం షాపుల నిర్వహణపై వ్యాపారులు ఎంతటి మోజు పడుతున్నారో స్పష్టమౌతుంది. 98షాపులకు ప్రభుత్వం నిర్ధేశించిన లీజు ధర మేరకు రూ.68.95,1206 ఆధాయం ప్రభుత్వానికి లభించాల్సి ఉండగా ఆ మొత్తానికి మించి 101 శాతం మేరకు అధికంగా ప్రభుత్వానికి లీజు రూపంలో ఆధాయం లభించడం విశేషం. సోమవారం రాత్రి 10గంటల వరకు అధికారులు మొత్తం 98 టెండర్‌ షెడ్యూళ్ళను ఖరారు చేయగా వాటిపై ప్రభుత్వానికి 138.62 కోట్లకు పైగా ఆధాయం లభించడం గమనార్హం. 2008 -2010 సంవత్సరాల లీజు కాలంలో జిల్లాలోని అన్ని షాపులతో కలిపి ప్రభుత్వానికి రూ.132 కోట్ల ఆధాయం లభించగా తాజాగా 98 షాపుల నిర్వహణ కోసం ప్రభుత్వానికి రూ.138కోట్ల ఆధాయం వచ్చిందంటే పరిస్ధితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణా జిల్లాల్లోనే అత్యధికంగా లీజు ధరను మేళ్ళచెరువు మండల కేంద్రంలోని వైన్‌షాప్‌ దక్కించుకుంది. గతంలో ఈ షాపు లీజు ధర రూ.1,34కోట్లు కాగా తాజాగా ఆ మొత్తం లీజు ధర రూ.3,69,99,999.99లకు చేరుకోవడం విశేషం. తెలంగాణా జిల్లాల్లోనే ఈ షాపుకు పలికిన ధర అధికమని వ్యాపార వర్గాలే పేర్కొంటున్నాయి. సంస్ధాన్‌ నారాయణపురం మండల కేంద్రంలోని వైన్‌షాపు ధర రూ.3,21,00,000 కోట్లు పలికి రెండవ స్ధానంలో నిలిచింది. భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్‌లోని వైన్‌షాప్‌ లీజు ధర అతి స్వల్పంగా ఉంది. ఈ షాపు కోసం ఒకే ఒక టెండర్‌ షెడ్యూళ్ళు దాఖలు కాగా లీజు ధరలు కోడ్‌ చేసిన 41,999,99 టెండర్‌ దారుకే ఈ షాపు దక్కింది. టెండర్‌ షెడ్యూళ్ళను ఖరారు చేసే ప్రక్రియ సోమవారం రాత్రి కూడా కొనసాగుతూనే ఉంది. టెండర్‌ షెడ్యూళ్ళ ఖరారు ప్రక్రియను అధికారులు పట్టణంలోని టౌన్‌హాల్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ సమక్షంలో టెండర్లు తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. వేల సంఖ్యలో టెండర్‌ దారులు వారి అనుచరులు హాజరు కావడంతో టౌన్‌హాల్‌ కిక్కిరిసింది. టౌన్‌హాల్‌లో కనీస వసతులు కల్పించని తీరుపట్ల పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండడం కనిపించింది. ఒక్కొక్కరికే ఒక్క షాపును కేటాయిస్తుండడంతో ఇతర షాపులను కూడా దక్కించుకున్న వారు వాటిని ప్రభుత్వ నిబంధనల మేరకు వదులుకోక తప్పలేదు. వారి స్ధానంలో అత్యధిక మొత్తాన్ని లీజుగా కోడ్‌ చేసిన రెండో వ్యక్తికి అధికారులు కేటాయించారు. పలువురు టెండర్‌ షెడ్యూళ్ళతో పాటు అందజేసిన డిడిలలో నగదుకు సంబంధించిన అంకెలు ఒక మాదిరిగా, నగదు వివరాలను అక్షరాల్లో పొందుపర్చే విషయంలో చేసిన పొరపాట్ల వల్ల తమకు దక్కిన షాపులను వదులుకోవల్సి వచ్చింది. టెండర్‌ షెడ్యూళ్ళ ఖరారు జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ చంపాలాల్‌, ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమీషనర్‌ జనార్ధన్‌, అసిస్టెంట్‌ కమీషనర్‌ ప్రేమ్‌ ప్రసాద్‌ల పర్యవేక్షణలో కొనసాగింది. మంగళవారం తెల్లవారు జాము వరకు టెండర్‌ షెడ్యూళ్ళ ఖరారు ప్రక్రియను కొనసాగిస్తామని డిప్యూటీ కమీషనర్‌ జనార్ధన్‌ ఆంధ్రప్రభకు తెలిపారు. మధ్యం షాపులను దక్కించుకున్న వ్యాపారులు టౌన్‌హాల్‌లో కేరింతలు వేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తుండగా షాపులు దక్కని వారు కొంత నిరాశతో వెనుదిరిగారు. సిండికేట్లు కొన్ని వ్యూహం ప్రకారం టెండర్‌ షెడ్యూళ్ళను దాఖలు చేసినప్పటికి వారిలో కొన్ని సిండికేట్లు బోర్లబొక్కల పడ్డాయి. మరికొన్ని సిండికేట్లు టెండర్‌ దాఖలు చేసిన షాపులలో కొన్ని షాపులు తమకే దక్కడంతో ఊపిరి పీల్చుకున్నాయి. అత్యధిక మొత్తాన్ని కోడ్‌చేసి షాపులను దక్కించుకున్న ఒక సిండికేట్‌ బాధ్యుడు ఆంధ్రప్రభతో మాట్లాడుతూ తమ సిండికేట్లో పని చేస్తున్న ప్రతి వ్యక్తి వాటాదారుడేనని వారి బతుకు దెరువు కోసం తప్పని పరిస్ధితిలో చావోరేవో తేల్చుకునేందుకై అత్యధిక మొత్తాన్ని కోడ్‌చేసి టెండర్‌ షెడ్యూళ్ళు దాఖలు చేశామని అభిప్రాయపడ్డారు. తమ అంచనాలు తప్పలేదని అంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేసారు. మొత్తం మీద జిల్లాలోని మధ్యం షాపుల వేళం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.300కోట్లకు పైగా ఆధాయం లభిస్తుందనే అభిప్రాయం ఎక్సైజ్‌ శాఖ అధికారుల నుంచి వినిపిస్తుంది.
Category: 0 comments

No comments:

Pages